సచివాలయ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం

CM inspected works of Secretariat, Ambedkar Statue and Martyrs Memorial

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.

తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్నతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం, డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు పరిశీలించారు.

తొలుత సచివాలయానికి చేరుకున్న సీఎం చివరి దశకు చేరుకున్న ఎలివేషన్ పనులను, ఫౌంటేన్, గ్రీన్ లాన్, టూంబ్ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్ డిజైన్ వర్కు తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం సీఎం ఛాంబర్ వుండే ఆరవ అంతస్తుకు చేరుకున్నారు. సీఎం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన టేబుల్లు, కుర్చీలు తదితర ఫర్నీచర్ ను సీఎం పరిశీలించారు.

గత పర్యటన సందర్భంగా సీఎం చేసిన సూచనల మేరకు వాల్ క్లాడింగ్, డెకరేషన్ తదితర తుదిమెరుగులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లని రంగుతో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయే విధంగా వేసిన మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు, అంతే అందంగా తీర్చిదిద్దిన ఛాంబర్ల ద్వారాల పనితీరును పరిశీలించి, మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను, వర్క్ ఏజెన్సీ అధికారులను సీఎం అభినందించారు. నిర్మాణం పూర్తయిన తరువాత అక్కడ చోటు చేసుకున్న గాలి వెలుతురుతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గమనించి సీఎం ఆనందం వ్యక్తం చేశారు. సీఎం ఛాంబర్ లోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు. సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నీచర్ ను తిలకించారు. ఏర్పాట్లన్నీ సిబ్బంది పనికి అనుకూలంగా వుండే విధంగా వున్నాయా లేవా అని ఆరా తీసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్ ను, వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను, కాన్ఫరెన్స్ హాల్ ను, సందర్శకుల కోసం వేచివుండే గదులను అందులోని సౌకర్యాలను సీఎం పరిశీలించారు. సమావేశాలు సహా, డైనింగ్ తదితర అవసరాలకోసం మల్టిపుల్ గా ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన విశాలవంతమైన హాల్ ను సీఎం పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగిన సీఎం, సీఎం కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. జీఏడి ప్రోటోకాల్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఛాంబర్లను సీఎం పరిశీలించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్, ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్, విఐపీల వెయిటింగ్ లాంజ్ లను సీఎం పరిశీలించారు.

మంత్రిలకు కేటాయించిన శాఖలు అన్నీ వొక దగ్గర వుండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, ఆ మంత్రికి చెందిన అన్ని శాఖల సిబ్బంది వొకే చోట వుంటే బాగుంటదని సీఎం అన్నారు. ఆయా శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలుండాలని సీఎం అధికారులకు సూచించారు.

అనంతరం గ్రౌండు ఫ్లోర్ కు చేరుకున్న సీఎం, దక్షిణ భాగం గుండా నడుచుకుంటూ అక్కడ నిర్మాణంలో వున్న పార్కింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు సీఎం కొన్ని సూచనలు చేశారు. అనంతరం సచివాలయం ప్రహారికి అంతర్గతంగా వున్న, బయట చుట్టూ నిర్మాణం చేస్తున్న రోడ్లు పరిసరాలను పరిశీలించారు. సచివాలయం ముందునుంచి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ట్యాంకుబండు మీదుగా వెళ్ళే మార్గాన్ని పరిశీలించారు. ఫ్లై ఓవర్ నుంచి, సచివాలయం ముందునుంచి నెక్లెస్ రోడ్డు దిశగా సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు విశాలంగా నిర్మితమౌతున్న రోడ్లను సీఎం పరిశీలించారు.

సెక్రటేరియట్ లోపలకు వెళ్ళే ప్రధానమార్గాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తికావచ్చినందుకు సీఎం సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి నిర్మాణంలో వున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు.

అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సీఎం అంబేద్కర్ విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను ఆడియో విజువల్ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ తదితర పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి గురించి మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ను, వర్క్ ఏజెన్సీలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని స్పష్టం చేశారు. చారిత్రకంగా నిర్మితమౌతున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

అక్కడి నుంచి తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం; లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని ఇంజనీర్లు మ్యాపుల ద్వారా సీఎంకు ఇంజనీర్లు వివరించారు. పనుల గురించి సంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కొన్నిసూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎంతో రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విప్ శ్రీ బాల్క సుమన్, శ్రీ ఎ. జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రోడ్లు భవనాలు శాఖ అధికారులు శ్రీ శ్రీనివాస్ రాజు, శ్రీ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు శ్రీ సుద్దాల సుధాకర్ తేజ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ తదితరులున్నారు.